Flipkart: ఫ్లిప్కార్ట్ కీలక నిర్ణయం.. ఇన్ స్టంట్ డెలివరీలకు గుడ్ బై!
Flipkart ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ మినిట్స్ సర్వీస్ దేశంలోని 14 నగరాల్లో అందుబాటులో ఉంది. దీని కోసం 300కు పైగా డార్క్ స్టోర్స్ (చిన్న గిడ్డంగులు) ఉన్నాయి. అక్టోబర్ 2025 నాటికి ఈ నెట్వర్క్ను 500 నుంచి 550 డార్క్ స్టోర్స్కు పెంచాలని ఫ్లిప్కార్ట్ యోచిస్తోంది.

Flipkart: వాల్మార్ట్కు చెందిన ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. తమ ఇన్ స్టంట్ డెలివరీ సర్వీస్ అయిన ఫ్లిప్కార్ట్ మినిట్స్ విస్తరణను పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇకపై ఈ సర్వీసు దేశంలోని కేవలం 6 నుంచి 8 పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఖర్చులను కంట్రోల్ చేసుకునేందుకే కంపెనీ ఈ చర్య తీసుకోనుంది.
ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ మినిట్స్ సర్వీస్ దేశంలోని 14 నగరాల్లో అందుబాటులో ఉంది. దీని కోసం 300కు పైగా డార్క్ స్టోర్స్ (చిన్న గిడ్డంగులు) ఉన్నాయి. అక్టోబర్ 2025 నాటికి ఈ నెట్వర్క్ను 500 నుంచి 550 డార్క్ స్టోర్స్కు పెంచాలని ఫ్లిప్కార్ట్ యోచిస్తోంది. అయితే, కంపెనీ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి ఏప్రిల్లో ఈ సంఖ్య సంవత్సరాంతానికి 800 వరకు ఉండవచ్చని తెలిపారు.
ఫ్లిప్కార్ట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
ఫ్లిప్కార్ట్ మినిట్స్ నేరుగా బ్లింకిట్ (ఇటర్నల్ కంపెనీ), స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో, బిగ్బాస్కెట్ బిబి నౌ, అమెజాన్ నౌ వంటి ఇన్ స్టంట్ డెలివరీ సర్వీస్లకు పోటీదారుగా ఉంది. నివేదికల ప్రకారం, భారతదేశంలోని ఇన్స్టంట్ డెలివరీ ఆర్డర్లలో 90 శాతానికి పైగా కేవలం టాప్ 8 నగరాల నుంచే వస్తున్నాయి. వీటిలో ఢిల్లీ-ఎన్సిఆర్, ముంబై, బెంగళూరు ప్రధానమైనవి. ఈ కారణంగానే కంపెనీ ఇప్పుడు ఈ నగరాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది.
సామాన్యులపై దీని ప్రభావం
ఫ్లిప్కార్ట్ మినిట్స్ సర్వీస్ ఇకపై దేశంలోని 14 నగరాలకు బదులుగా కేవలం 8 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్కార్ట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రధాన 8 నగరాలు కాకుండా మిగిలిన నగరాల్లోని వినియోగదారులు ఫ్లిప్కార్ట్ మినిట్స్ సర్వీస్ ప్రయోజనాన్ని పొందలేకపోవచ్చు. వారు నార్మల్ డెలివరీపైనే ఆధారపడాల్సి రావచ్చు. అయితే, ఫ్లిప్కార్ట్ ఈ నిర్ణయం దాని పోటీదారు స్విగ్గీ మాదిరిగానే ఉంది. మరోవైపు, ఇటర్నల్ గ్రూప్కు చెందిన బ్లింకిట్ నష్టాలను భరించడానికి సిద్ధంగా లేనప్పటికీ, మార్కెట్లో తమ వాటాను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ఫ్లిప్కార్ట్ ప్రణాళిక ఇదే:
హెచ్ఎస్బిసి సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం.. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్కు ముందు 500 కంటే ఎక్కువ డార్క్ స్టోర్లను తెరవాలని యోచిస్తోంది. కానీ, అదే సమయంలో కంపెనీ తన నెలవారీ రూ.340-రూ.350 కోట్ల వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన ఒత్తిడిలో కూడా ఉంది. ఈ చర్య కంపెనీ 2026లో ప్రతిపాదించిన ఐపిఓ కోసం సన్నాహాల్లో భాగంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో ఫ్లిప్కార్ట్ బోర్డు కంపెనీ మెయిన్ ఆఫీస్ సింగపూర్ నుంచి భారతదేశానికి మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం భారతీయ మార్కెట్లో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవడం, ఐపిఓకు ముందు దేశీయ మార్కెట్లో గట్టిగా నిలబడాలని ప్రయత్నిస్తోంది.