Telangana bonalu: తెలంగాణ బోనాల వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసా?

Telangana bonalu: తెలంగాణలో నేటి నుంచి బోనాల పండుగ ప్రారంభం కానుంది. ఆషాఢ మాసంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో వారం ఈ బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ బోనాల పండగకు వేల చరిత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఈ బోనాల పండుగ ఎలా ప్రారంభమైంది? ఎందుకు ఈ బోనాలు జరుపుకుంటారు? పూర్తి వివరాలు కూడా నేటి స్టోరీలో తెలుసుకుందాం.
బోనాలు పండుగ తెలంగాణలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఒక్కో ప్రాంతం వారు జరుపుకుంటారు. భోజనం అనే పదానికి బోనం వికృతి పదం. అమ్మవారికి భోజనం పెట్టే దానిని బోనం అంటారు. తెలంగాణ సంప్రదాయంలో ఈ బోనం పండుగ చాలా ముఖ్యమైనది. దీనికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. మొదటిసారిగా బోనాలు కాకతీయ రాజులు పెట్టినట్లు తెలుస్తోంది. కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబకి ఆలయంలో ప్రత్యేక పూజలు అప్పుడు నిర్వహించారట. ప్రతాప రుద్రుని వచ్చిన తర్వాత ముస్లింలు కూడా పూజలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చారట. ఇక అప్పటి నుంచి బోనాలు ఎత్తడం ఒక ఆనవాయితీగా వచ్చింది. అయితే మొదట బోనం గోల్కొండలోని శ్రీ జగదాంబకి ఆలయంలో మొదటి బోనాలు నిర్వహించగా.. బల్కం పేట రేణుక ఎల్లమ్మ గుడిలో రెండో వారం, సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మూడో వారం, లాల్ దర్వాజలోని శ్రీ మహంకాళి ఆలయంలో నాలుగో వారం బోనాలు ఎత్తుతారు.
ఈ బోనాలు ఎత్తడానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. ప్రతీ ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తారు. ఈ క్రమంలో ఆమెకు భోజనం, చీర, సారెలు వంటివి ఇస్తారు. పుట్టింటికి వచ్చిన కూతురిని ఎలా చూసుకుంటారో.. అమ్మవారికి అలా ప్రేమగా బోనం సమర్పిస్తారు. అయితే ఒక్కో ఏరియాలో ఒక్కో పేరుతో అమ్మవారు ఉంటుంది. అయితే బోనాలు సమర్పించే వారు కొత్త దుస్తులు ధరించాలి. అలాగే కొత్త పొయ్యి వేసి కొత్త కుండలో ప్రసాదం తయారు చేయాలి. దానికి పసుపు, కుంకుమతో అలంకరించి, బియ్యం, పాలు, బెల్లం వంటివి వేసి ప్రసాదం చేయాలి. దీనిపై మరో కుండను పెట్టి అందులో దీపం పెట్టి వేపాకులు కట్టాలి. ఈ బోనం తల మీద పెట్టుకుని డప్పులతో అమ్మవారి దర్శనానికి వెళ్లాలి. కొందరు బోనం సమర్పించలేని వారు అమ్మవారికి ఒడి బియ్యాన్ని కూడా సమర్పిస్తుంటారు. మరికొందరు మేకలు, కోళ్లను కూడా మొక్కులుగా బలి ఇస్తుంటారు.