Vannur Swamy Temple : ఆ ఊరిలో వంద మందికి ఒక్కటే పేరు.. సత్యసాయి జిల్లాలో వింత గ్రామం

Vannur Swamy Temple : ఓ గ్రామంలో వంద మందికి ఒకే పేరు ఉంటుంది. ‘వన్నూరప్ప’ అని పిలిస్తే, ఏకంగా వంద మంది పలుకుతారు. ‘వన్నూరమ్మ’, ‘వన్నూర్రెడ్డి’, ‘వన్నూరక్క’ వంటి పేర్లలోనూ ‘వన్నూరు’ స్వామి పేరు కలిసి ఉంటుంది. సత్యసాయి జిల్లా, తాడిమర్రి మండలం, మరవపల్లి గ్రామంలో వెలసిన హజరత్ వన్నూరు వలి సాహెబ్ (వన్నూరు స్వామి) మహిమలకు ఇది ఒక వినూత్న నిదర్శనం. 30 ఏళ్లు పైబడిన సుమారు వంద మందికి పైగా గ్రామస్తులు తమ పేర్లను స్వామి పేరుతో పెట్టుకున్నారంటే ఆయన మహిమలు ఎంత గొప్పవో ఊహించవచ్చు. తమను నమ్మిన వారికి కొంగు బంగారంగా నిలిచే ఈ స్వామి గ్రామ ప్రజలను ఎలాంటి ఆపదలు, రోగాల నుంచైనా కాపాడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మరవపల్లి గ్రామం 200 ఏళ్లుగా వన్నూరు స్వామిని కొలుస్తోంది. గ్రామ పెద్దలు చెప్పే కథ ప్రకారం.. రెండు శతాబ్దాల క్రితం ఇప్పుడున్న మరవపల్లి కేవలం రెండు, మూడు గుడిసెలతో ఒక చిన్న కుగ్రామం. ఆ సమయంలో ఎం.అగ్రహారం గ్రామంలో చెరువు పనులు జరుగుతుండగా కడప జిల్లాలోని లింగాల మండలం అంకేన్పల్లికి చెందిన కొందరు పనివారు ఇక్కడి గుడిసెల్లో ఉంటూ పని చేసేవారట. ఆ కాలంలోనే కనెకల్లు సమీపంలోని వన్నూరు గ్రామానికి చెందిన వన్నూరుస్వామి, గుర్రంపై తూర్పు ప్రాంతానికి యుద్ధానికి వెళ్లారట. తిరుగు ప్రయాణంలో ఈ గుడిసెల వద్ద ఆగి, ఒక వేపపుల్లతో పళ్లు తోముకున్నారు. ఆ పుల్లను అక్కడే భూమిలో గుచ్చారు. ఆ వేపపుల్ల కాలక్రమేణా మహావృక్షంగా మారిందని గ్రామస్తులు నమ్ముతారు.
Read Also:Telangana: తెలంగాణ విద్యార్థులు ఇది మీకోసమే.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి
ఆ మహాపురుషుడు అక్కడే ఉన్న ఒక బావిలో ముఖం కడుక్కొని, తన పాదరక్షలను వదిలి వెళ్ళిపోయారట. అప్పటి నుంచి, గుడిసెల వద్ద ఉన్నవారు ఆ వేపచెట్టుకు పూజలు చేయడం ప్రారంభించగా, వన్నూరుస్వామి తమను ఎలాంటి ఆపదల నుంచైనా కాపాడడం ప్రారంభించాడని భక్తులు చెబుతారు.వన్నూరు స్వామి మహిమలకు అనేక ఉదాహరణలను గ్రామ ప్రజలు సగర్వంగా చెప్పుకుంటారు. సుమారు 60 ఏళ్ల క్రితం, గ్రామానికి ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న ఎం.అగ్రహారంలో కలరా వ్యాధి తీవ్రంగా వ్యాపించి, పదుల సంఖ్యలో గ్రామస్తులు మరణించారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మరవపల్లిలో ఒక్కరికీ కూడా కలరా సోకలేదని పెద్దలు చెబుతారు. ఆలయం పక్కన ఉన్న బావిలో వన్నూరుస్వామి ముఖం కడుక్కోవడంతో ఆ బావి నీళ్లకు మహిమలు వచ్చాయని ఆ నీరే తమను కాపాడిందని గ్రామస్తులు బలంగా నమ్ముతారు.
పదేళ్ల క్రితం, లింగమ్మ అనే అంధురాలు జీవితంపై విరక్తి చెంది అదే బావిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిందట. అయితే, దేవుని మహిమతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా బయటపడిందని గ్రామస్తులు ఆశ్చర్యంగా చెబుతారు. బావి ఒడ్డున ఆడుకుంటున్న పలువురు పిల్లలు ప్రమాదవశాత్తు బావిలో పడినప్పటికీ, వారికి చిన్నపాటి గాయం కూడా కాలేదట. ఇలా ఎన్నో ఉదాహరణలు చెబుతుంటారు గ్రామస్తులు.
Read Also:Numerology: అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. మీరే కింగ్ ఇక
వన్నూరుస్వామి ఆలయంలో గ్రామస్తులు ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గతంలో గ్రామస్తులే పూజలు చేసేవారు. అయితే, కొంత కాలంగా మరవపల్లికి చెందిన ఒక ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తిని పూజారిగా నియమించారు. ఆయన ప్రతి గురువారం స్వామికి దీపాలను వెలిగించి, చక్కెర చదివించి భక్తులకు పంచుతారు. ఇది మత సామరస్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది. కోర్కెలు నెరవేరిన భక్తులు స్వామికి పొట్టేళ్లను బలిచ్చి, వాటి మాంసాన్ని గ్రామస్తులకు పంచుతారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించినప్పుడు, చుట్టుపక్కల గ్రామాలు విలవిలలాడినప్పటికీ, మరవపల్లిలో ఒక్కరికీ కూడా కరోనా సోకకుండా స్వామి కాపాడారని గ్రామస్తులు గట్టిగా చెబుతారు.