IMD Forecast : రైతన్నలకు శుభవార్త.. ఐఎండీ సంచలన అంచనా.. జూన్ లోనే కుండపోతలట

IMD Forecast : ఈ సంవత్సరం భారతదేశంలో వానాకాలం (రుతుపవనాలు) ముందే వచ్చేసింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో వచ్చే రుతుపవనాలు, ఈసారి ఏకంగా 16 సంవత్సరాల్లోనే అత్యంత ముందుగా దేశంలోకి ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ (IMD) చెబుతున్న దాని ప్రకారం.. ఈసారి జూన్ నెలలో సాధారణం కంటే 108 శాతం ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా. అంటే, నిప్పులు కురిసే ఎండలకు బదులు, భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొంటుంది. ఇది రైతన్నల ఆశలను నింపడమే కాదు, భూగర్భ జలాలకూ జీవం పోస్తుంది.
నైరుతి రుతుపవనాలు తమ సాధారణ షెడ్యూల్ కంటే చాలా వేగంగా దూసుకువచ్చాయి. ఐఎండీ నివేదికల ప్రకారం, ఈసారి దేశం మొత్తం రుతుపవనాల కాలంలో 87 సెం.మీ. సగటు వర్షపాతంలో 106 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఇది దేశంలోని వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలకు భారీ ఊరట. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలను కలుపుకొని ఉన్న “మాన్సూన్ కోర్ జోన్”లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ ప్రాంత వ్యవసాయానికి ఈ వర్షాలే ఆధారం. మధ్య, దక్షిణ భారతదేశంలో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి.ఉత్తర-పశ్చిమ భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈశాన్య భారతదేశంలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు పడవచ్చు.
Read Also:Liver Infections: లివర్కు ఎన్ని రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి? అవి ఎలా మొదలవుతాయి?
రుతుపవనాల అద్భుత ప్రవేశం ఇప్పటికే కొన్ని ప్రాంతాలపై ప్రభావం చూపింది. ఐఎండీ మే 26న ప్రకటించిన దాని ప్రకారం.. నైరుతి రుతుపవనాలు తమ సాధారణ తేదీ కంటే 16 రోజులు ముందుగానే ముంబైని చేరుకున్నాయి. 1950 తర్వాత ముంబైలో ఇంత ముందుగా రుతుపవనాలు రావడం ఇదే తొలిసారి. అంతకుముందు మే 24న రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. ఇది 2009 తర్వాత ఇంత త్వరగా రావడం ఇదే మొదటిసారి. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళలో ప్రవేశించి, జూన్ 11 నాటికి ముంబై చేరుకుంటాయి. జూలై 8 నాటికి దేశమంతా విస్తరిస్తాయి. ఈసారి ముందుగానే యాక్టివ్ అయిన రుతుపవనాలు కేరళ, మహారాష్ట్రలలో ఇప్పటికే భారీ వర్షాలకు కారణమయ్యాయి. ముంబైలో కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు, కాల్వలు నిండిపోయి, మెట్రో, రైల్వే స్టేషన్ల లోపల కూడా నీరు చేరింది.
ఈ ముందుస్తు వర్షాలు రైతన్నలకు గొప్ప వరం. భారతదేశంలో సుమారు 60శాతం వ్యవసాయ భూమి నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది. వరి, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కంది వంటి ఖరీఫ్ పంటలకు ఈ వర్షాలు అత్యంత కీలకం. ముందుగానే వర్షాలు కురవడం వల్ల రైతులు సాగు పనులు వేగంగా మొదలుపెట్టవచ్చు. వాతావరణ శాఖ రాబోయే కొద్ది రోజుల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర తీర ప్రాంతాలు, గోవాలోని కొన్ని ప్రాంతాల్లో చాలా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా ముంబై నగరం, కొంకణ్, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలు, కర్ణాటకలోని తీరప్రాంత, ఘాట్ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈసారి వానాకాలం దేశానికి నీటి భద్రతను పెంచడంతో పాటు, ఆహార భద్రతకు కూడా భరోసా ఇవ్వనుంది.
Read Also:Alcohol Ban : 73 ఏళ్ల తర్వాత తొలిసారి.. సౌదీలో ఆల్కహాల్ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్