Traffic Fines : రూ. 12,000 కోట్ల జరిమానాలు.. రూ. 9,000 కోట్లు బాకీ.. ట్రాఫిక్ రూల్స్ పాటించడమే లేదట

Traffic Fines : భారతదేశంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం ఎంత కామనో, చలాన్లల నుంచి తప్పించుకోవడానికి లంచం ఇవ్వడం కూడా అంతే కామన్ అని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. వాహనం రెండు చక్రాలదైనా, నాలుగు చక్రాలదైనా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించడం తప్పనిసరి. కానీ భారత్ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉందని, ప్రతిరోజూ లక్షలాది మంది ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నారని CARS24 నిర్వహించిన ఒక అంతర్గత సర్వే నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు, చాలా మంది జరిమానా చెల్లించడానికి బదులు, ట్రాఫిక్ పోలీసులకు “చాయ్-పానీ ఖర్చు” (లంచం) ఇచ్చి తప్పించుకుంటున్నారని ఈ నివేదికలో వెల్లడైంది.
CARS24 సర్వే నివేదిక ప్రకారం.. భారతదేశంలో 53 శాతం మంది ప్రజలు ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి పోలీసులకు లంచం (చాయ్-పానీ ఖర్చు) ఇస్తున్నారు. కేవలం 29 శాతం మంది మాత్రమే సరైన మార్గంలో చలాన్లు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ వెబ్సైట్లు, మీడియా నివేదికల ఆధారంగా CARS24 నిర్వహించిన ఈ సర్వేలో 38.5 శాతం మంది ప్రజలు చలాన్ల నుండి తప్పించుకోవడానికి ఒకటి లేదా రెండుసార్లు పోలీసులకు లంచం ఇచ్చామని అంగీకరించారు. 16 శాతం మంది ప్రజలు తాము తరచుగా చలాన్ల నుంచి తప్పించుకోవడానికి పోలీసులకు లంచం ఇస్తున్నామని అంగీకరించారు. వీరందరితో పాటు, 29.2 శాతం మంది ప్రజలు ఎల్లప్పుడూ సరైన మార్గంలో ట్రాఫిక్ చలాన్లను చెల్లిస్తున్నారని తెలిసింది. సర్వే ప్రకారం, 149 కోట్ల జనాభా ఉన్న దేశంలో, కేవలం 11 కోట్ల మంది మాత్రమే ఫోర్-వీలర్లను ఉపయోగిస్తున్నారు, 35 కోట్ల టూ-వీలర్లు ఉన్నాయి.
Read Also:COVID Cases : కరోనా మళ్లీ వస్తుందా? తాజా కేసుల వ్యాప్తిపై డాక్టర్లు ఏమంటున్నారంటే ?
చలాన్లు, రహదారి భద్రతపై ప్రజల దృక్పథం ఏమిటో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించారు. 1000 మందిని చేర్చుకుని చేసిన ఈ సర్వేలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రజలు నియమాలను కేవలం తప్పనిసరి అయినప్పుడు మాత్రమే పాటిస్తున్నారు. భద్రత వారికి ప్రాధాన్యత అంశం కాదు. 43 శాతం మంది ప్రజలు పోలీసుల ఉనికి కారణంగా ట్రాఫిక్ నియమాలను పాటిస్తున్నారని చెప్పారు. 31 శాతం మంది పోలీసులు కనిపించిన తర్వాత అప్రమత్తమవుతారు. 17.6 శాతం మంది చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తున్నారు.
2024 సంవత్సరంలో దేశంలో మొత్తం 8 కోట్ల చలాన్లు జారీ అయ్యాయి. అంటే గతేడాది రహదారిపై నడిపిన ప్రతి రెండవ వాహనానికి జరిమానా విధించబడింది. ఇందులో కూడా చాలా మంది చలాన్లను చెల్లించలేదు. హర్యానాకు చెందిన ఒక ట్రక్కు యజమానికి ఓవర్ స్పీడింగ్ కోసం రూ.2 లక్షల చలాన్ విధించబడింది. బెంగళూరులో ఒక టూ-వీలర్ యజమానికి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందుకు రూ.3 లక్షల విలువైన 500 చలాన్లు జారీ చేయబడ్డాయి. దేశంలోని ఐటీ హబ్గా ప్రసిద్ధి చెందిన గురుగ్రామ్లో ప్రతిరోజూ 45,000 ట్రాఫిక్ చలాన్లు జారీ చేస్తున్నారు. నోయిడాలో ఒకే నెలలో 3 లక్షలకు పైగా ట్రాఫిక్ చలాన్లు జారీ అయ్యాయి. ఇది దేశంలోనే అత్యధికం.
Read Also:Bhairavam Boycott : ట్రెండ్ అవుతున్న భైరవం బాయ్ కాట్.. ఎందుకోసమంటే?
ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించేవారిలో 55 శాతం మంది ఫోర్-వీలర్ యజమానులు, 45 శాతం మంది టూ-వీలర్ యజమానులు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 40 శాతం మంది ప్రజలు ట్రాఫిక్ నియమాలను తీవ్రంగా పరిగణించరు. 2024 లో జారీ చేయబడిన రూ.12,000 కోట్ల జరిమానాలలో, 75% చెల్లించలేదని షాకింగ్ నిజం. దాదాపు రూ.9,000 కోట్ల చలాన్ల చెల్లింపు ఇంకా బాకీ ఉంది. భారతదేశంలో వసూలు చేయబడిన జరిమానా మొత్తం చాలా చిన్న దేశాల జీడీపీ కంటే కూడా ఎక్కువ.