Kantara : ‘కాంతార’ షూటింగ్లో ప్రమాదం – చిత్ర యూనిట్కు నోటీసులు!

Kantara : రిషబ్ శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం జరిగింది. చిత్రీకరణ జరుగుతున్న పడవ నీటిలో బోల్తా పడింది. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చిత్ర యూనిట్ తెలిపింది. పడవ బోల్తా పడడం మాత్రం సాధారణ ప్రమాదం కాదు. కొద్దిపాటి పొరపాటు జరిగినా భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది. కానీ అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదు. అయితే, ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం సీరియస్గా తీసుకుంది. చిత్ర యూనిట్కు నోటీసులు ఇవ్వడానికి రెడీ అయింది.
శనివారం అంటే జూన్ 14 సాయంత్రం శివమొగ్గ జిల్లాలోని మాణి రిజర్వాయర్ సమీపంలో చిత్రీకరణ జరుగుతుండగా పడవ బోల్తా పడినట్లు తెలుస్తోంది. పడవ బోల్తా పడిన సమయంలో అందులో దాదాపు 30 మంది ఉన్నట్లు సమాచారం. వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కొందరికి గాయాలు కాగా, గాయపడిన వారిని షికారిపురలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, నిర్మాణ సంస్థ హోంబలేకు చెందిన ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆదర్శ్ క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Passport Process : ఆన్లైన్లో త్వరగా పాస్పోర్ట్ ఎలా పొందాలి?.. అవసరమైన పత్రాలు ఇవే!
తాజాగా శివమొగ్గ జిల్లా కలెక్టర్ ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. చిత్ర యూనిట్ షూటింగ్ కోసం అన్ని రకాల అనుమతులు తీసుకుందా, చిత్రీకరణ సమయంలో అవసరమైన భద్రతా జాగ్రత్తలు పాటించిందా అని పరిశీలించడానికి రెడీ అయిపోయారు. ఈ విషయం మీద కలెక్టర్ డా. గురుదత్ హెగ్డే మాట్లాడుతూ.. “స్థానిక పరిపాలన నుండి ‘కాంతార’ షూటింగ్కు అనుమతి తీసుకోలేదు. అన్ని అనుమతులు బెంగళూరు నుంచే తీసుకున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్కు నోటీసు జారీ చేసి, షూటింగ్ అనుమతి పత్రాలను తనిఖీ చేస్తాం” అని తెలిపారు.
అంతేకాకుండా “షూటింగ్ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. శివమొగ్గ పర్యాటక రంగానికి షూటింగ్ల వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే, షూటింగ్ చేసేటప్పుడు అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలి. ‘కాంతార’ చిత్ర యూనిట్ అన్ని భద్రతా చర్యలను తీసుకుందా లేదా అని పరిశీలించాల్సి ఉంది. అందుకే, ఇప్పుడు హొసనగర తహసీల్దార్ రష్మి ద్వారా నోటీసు ఇవ్వాలని సూచించాను” అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఘటనతో సినీ రంగంలో షూటింగ్ భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. జిల్లా యంత్రాంగం దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read Also: Aloo Dahi Sabzi : వేసవిలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే రుచికరమైన ఆలూ దహీ సబ్జీ రెసిపీ