Kavitha : సీఎం నినాదాలు.. కండువాలు లేవు.. కవిత భవిష్యత్ కార్యాచరణ ఏంటి?
బీఆర్ఎస్ లో చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొని 'కోవర్టులను' పక్కన పెట్టి ముందుకు సాగితే పార్టీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Kavitha : బీఆర్ఎస్ లో చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొని ‘కోవర్టులను’ పక్కన పెట్టి ముందుకు సాగితే పార్టీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ‘‘కేసీఆర్ దేవుడు.. కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి. వారి వల్లే నష్టం జరుగుతోంది’’ అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్న కవిత శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆమె రాసిన లేఖ గురువారం వెలుగులోకి వచ్చి తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కవిత లేఖ లీక్ వెనుక కుట్ర?
“నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లు తెలిసింది. రెండు వారాల క్రితం నేను కేసీఆర్కు లేఖ రాశా. గతంలో కూడా లేఖల ద్వారా కేసీఆర్కు అనేకసార్లు అభిప్రాయాలు చెప్పా. నాపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఇటీవలే చెప్పా. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో.. ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది” అని కవిత అన్నారు.
Read Also: పెరుగుతున్న కరోనా.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ గ్యాడ్జెట్స్ ఇవే
పార్టీలో అన్ని స్థాయుల్లో ఉన్న వారు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే తాను లేఖలో చెప్పా అన్నారు. ఇందులో తన వ్యక్తిగత ఎజెండా ఏం లేదన్నారు.పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే.. దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె హితవు పలికారు. తాను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే.. పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటని? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
లేఖ బయటకు రావడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయని, బీఆర్ఎస్ ఆగమైపోయిందని ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. ఎయిర్ పోర్టులో కవితకు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చినా ఎవరూ గులాబీ కండువాలు వేసుకోలేదు. “కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి.. సీఎం.. సీఎం..” అని నినాదాలు చేశారు. అభిమానులకు అభివాదం చేసి కవిత వెళ్లిపోయారు.
కవిత కేసీఆర్కు రాసిన లేఖ, ఆ లేఖ లీక్ అవ్వడం, ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడిన తీరు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. కొన్ని కీలక అంశాలు ఆమె వ్యాఖ్యల వెనుక దాగి ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత తన లేఖలో పార్టీలోని లోపాలను, కేసీఆర్ ప్రసంగంలో బీజేపీపై తక్కువగా మాట్లాడడం వల్ల కలిగిన అనుమానాలను స్పష్టంగా ప్రస్తావించారు. ఇది పార్టీలో కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల వల్ల నష్టం జరుగుతోందని, కార్యకర్తలకు నాయకత్వానికి దూరం పెరిగిందని పరోక్షంగా చెప్పినట్లు భావిస్తున్నారు. ఆమె “కేసీఆర్ చుట్టూ దయ్యాలు” అన్న వ్యాఖ్యలు పరోక్షంగా కొందరు కీలక నాయకులను (ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు) ఉద్దేశించే అయి ఉండవచ్చని ఊహాగానాలున్నాయి.
Read Also: ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులున్నాయో ఇలా సింపుల్ గా తెలుసుకోండి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయిన తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆమె మళ్లీ క్రియాశీలంగా మారుతూ పార్టీలో తన స్థానాన్ని, ప్రాముఖ్యతను తిరిగి పొందాలని చూస్తున్నారు. ఈ లేఖ లీక్ కావడం ద్వారా ఆమె తనను పార్టీలో పక్కన పెట్టేస్తున్నారని, తన అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని ప్రజలకు, కార్యకర్తలకు తెలియజేసే ప్రయత్నం చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ బీజేపీపై కేవలం రెండు నిమిషాలు మాట్లాడడంపై ఆమె లేఖలో ప్రశ్నించడం, బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలకు దారితీసిందని పేర్కొనడం గమనార్హం. కాంగ్రెస్ బలహీనపడుతున్న నేపథ్యంలో బీజేపీ ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని కొందరు బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారని చెప్పడం, బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో కలవడానికి సిద్ధంగా ఉండాలనే సంకేతాలను పంపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్టీలో అంతర్గత ప్లీనరీ నిర్వహించి, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆమె కేసీఆర్కు సూచించారు. ఇది కేవలం ఒక సలహా మాత్రమే కాకుండా, పార్టీలో దిశానిర్దేశం లేదని, నాయకత్వం కార్యకర్తలకు అందుబాటులో లేదని చెప్పకనే చెప్పినట్లుంది. ఈ లేఖ లీక్ అవ్వడం కూడా ఒక రాజకీయ వ్యూహంలో భాగమేనా అనే సందేహాలున్నాయి. కవిత స్వయంగా లేఖ లీక్ అవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినా, ఒక పెద్ద నాయకురాలి లేఖ ఇంత సులభంగా బయటకు రావడం వెనుక ఏదో ఉద్దేశ్యం ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. ఇది పార్టీలో ఒక కొత్త చర్చను లేవనెత్తుతుంది. నాయకత్వంపై ఒత్తిడి పెంచి, మార్పులకు దారితీస్తుందని ఆమె ఆశించి ఉండవచ్చు.
మొత్తంగా, కవిత లేఖ, ఆమె వ్యాఖ్యలు బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు, నాయకత్వ సమస్యలు, భవిష్యత్ రాజకీయ దిశపై తీవ్రమైన చర్చకు దారితీశాయి. ఆమె ‘సీఎం.. సీఎం..’ నినాదాలు, గులాబీ కండువాలు లేకుండా వచ్చిన అభిమానులు… ఇవన్నీ కవిత భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై, ఆమె బీఆర్ఎస్లోనే కొనసాగుతారా లేక వేరే మార్గాలను అన్వేషిస్తారా అనే దానిపై ఉత్కంఠను రేపుతున్నాయి.