Atal Pension Yojana : అదిరిపోయే స్కీమ్.. రూ.376కడితే చాలు.. ప్రతినెలా రూ.5000 పెన్షన్

Atal Pension Yojana : కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన పథకాల్లో ఒకటి అటల్ పెన్షన్ యోజన. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రతి నెలా రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ముఖ్యంగా, నెలకు కేవలం రూ.376 జమ చేయడం ద్వారా ప్రతి నెలా రూ.5,000 పెన్షన్ ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో ఎవరైనా చేరవచ్చు. కాకపోతే భారతీయుడై ఉండాలి. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో తక్కువ ఆదాయం ఉన్నవారికి వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. అటల్ పెన్షన్ యోజనలో మీరు నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేయవచ్చు. 60 సంవత్సరాల తర్వాత మీరు జమ చేసిన మొత్తం ఆధారంగా ప్రతి నెలా రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000 లేదా రూ.5,000 పెన్షన్ పొందవచ్చు.
Read Also:ChatGPT : ఆదాయానికి కొత్త మార్గాలు..ChatGPTతో డబ్బులు సంపాదించడం ఎలా?
అటల్ పెన్షన్ యోజన కింద మీరు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయస్సు వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నవారు వేర్వేరు పెన్షన్ మొత్తాల కోసం వేర్వేరు నెలవారీ ప్రీమియం చెల్లించాలి. రూ.5,000 నెలవారీ పెన్షన్ కోసం, మీ వయస్సును బట్టి వేర్వేరు ప్రీమియంలు ఉంటాయి. మీరు 25 సంవత్సరాల వయస్సులో చేరితే ప్రతి నెలా రూ.5,000 ఎలా పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.
మీరు 25 సంవత్సరాల వయస్సు నుండి అటల్ పెన్షన్ యోజనలో ప్రతి నెలా రూ.376 జమ చేస్తే, మీరు 60 సంవత్సరాల వయస్సు తర్వాత ప్రతి నెలా రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. మీరు 35 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. ఇది సుమారు రూ.1,57,920 అవుతుంది. ఈ లెక్కన పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా మీ ఖాతాలో రూ.5,000 జమ అవుతాయి. ఈ పథకం ద్వారా అల్ప ఆదాయ వర్గాల ప్రజలు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను పొందవచ్చు. కాబట్టి, అర్హులైన వారందరూ ఈ పథకంలో చేరి, తమ భవిష్యత్తును సురక్షితంగా మార్చుకోవచ్చు.
Read Also:Packaged Milk : ప్యాకెట్ పాలను మరిగించి తాగాలా లేదా పచ్చివే తాగాలా.. నిపుణులు ఏమంటున్నారంటే ?