Manjamma Jogati: ఆత్మగౌరవమే ఆయుధంగా మలిచిన.. మంజమ్మ జోగతి విజయగాథ!

Manjamma Jogati: మనిషి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏదీ ఉండదు అని నిరూపించిన గొప్ప వ్యక్తి పద్మశ్రీ మంజమ్మ జోగతి. కన్నవాళ్లే కాదన్నారు.. సమాజం చీదరించుకుంది.. అయినప్పటికీ తన ఆత్మగౌరవాన్ని వదులుకోకుండా, తన కళను నమ్ముకొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన మంజమ్మ కథ ఎందరికో ఆదర్శం.
కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో మంజునాథ శెట్టిగా జన్మించిన మంజమ్మ తన 15వ ఏట తాను అబ్బాయి కాదని, అమ్మాయి అని గుర్తించింది. ఈ సత్యాన్ని తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు షాక్ అయ్యారు. సాంప్రదాయ కుటుంబం కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయితే మంజునాథగా ఉన్న ఆమె జోగప్పగా మారాలని నిర్ణయించుకుంది. అయితే జోగప్ప అనేది అతి పురాతన హిజ్రాల వర్గం. వీరు దేవుడిని అంటే రేణుకా ఎల్లమ్మ దేవతను వివాహం చేసుకుని తమ జీవితాన్ని దేవుడికి అంకితం చేస్తారు. అలా మంజునాథ్ శెట్టి హులిగేయమ్మ ఆలయంలో పూజలు చేయించుకుని మంజమ్మ జోగతిగా మారింది. అయితే జోగప్పగా మారిన తర్వాత ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. కన్న కుటుంబం ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ఇంటి నుంచి బయటకు వచ్చిన మంజమ్మకు ఎక్కడా పని దొరకలేదు. కడుపు నింపుకోవడం కోసం ఇతర హిజ్రాల మాదిరిగానే చీర కట్టుకొని వీధుల్లో భిక్షాటన చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆమె ఎన్నో అవమానాలను, వేధింపులను ఎదుర్కొంది. కొన్ని సందర్భాలలో లైంగిక వేధింపులను భరించలేక ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. కానీ, అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. ఇంత జరిగినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు, తోబుట్టువులు కూడా ఆమెను పలకరించడానికి ఆసుపత్రికి రాలేదు. ఈ సంఘటన మంజమ్మను మరింత కృంగదీసింది.
మంజమ్మ ఆత్మవిశ్వాసం, కళ పట్ల ఆమె కున్న ప్రేమ తిరిగి నిలబెట్టాయి. ఒక తండ్రి, కొడుకుల సహాయంతో ఆమె తనలోని కళను గుర్తించింది. కాలవ్వ జోగతి అనే ప్రముఖ కళాకారిణి వద్ద జోగతి నృత్యాన్ని నేర్చుకుంది. ఈ నృత్యం జోగప్పలకు మాత్రమే పరిమితమైన ఒక ప్రత్యేకమైన జానపద కళ. కాలవ్వ బృందంలో చేరిన తర్వాత మంజమ్మ కర్ణాటక అంతటా వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ప్రదర్శనలు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. కాలవ్వ మరణానంతరం మంజమ్మ ఆ బృందానికి నాయకత్వం వహించింది. జోగతి నృత్యానికి ప్రజాదరణ తీసుకురావడానికి ఎంతో కృషి చేసింది. పేదరికం, సాంఘిక బహిష్కరణలు, అత్యాచారాలను తట్టుకుంటూనే మంజమ్మ జోగతి నృత్యంతో పాటు, దేవతలను స్తుతిస్తూ కన్నడ జానపద గీతాలు పాడటంలో కూడా ప్రావీణ్యం సంపాదించుకుంది. ఆమె కళా సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం 2006లో కర్ణాటక జనపద అకాడమీ అవార్డుతో సత్కరించింది. ఆ తర్వాత 2010లో కర్ణాటక ప్రభుత్వం వార్షిక కన్నడ రాజ్యోత్సవ అవార్డును కూడా ప్రదానం చేసింది. 2019లో, ఆమె కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఇలాంటి ఉన్నత పదవిని చేపట్టిన తొలి ట్రాన్స్జెండర్ మంజమ్మే కావడం విశేషం. జనవరి 2021లో జానపద కళల రంగానికి ఆమె చేసిన విశేష కృషికి భారత ప్రభుత్వం ఆమెకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె తీసుకుంది. ఇది ఆమె ఆత్మవిశ్వాసానికి, సంప్రదాయాలపై ఆమెకున్న గౌరవానికి నిదర్శనం. ఆమె జీవితం ఎందరో ట్రాన్స్జెండర్లకు స్ఫూర్తిదాయకం.
ఇది కూడా చూడండి: Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు