DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్..డీకే శివకుమార్ సీఎం అవుతారా?

DK Shivakumar: కర్ణాటక రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాబోయే రెండు, మూడు నెలల్లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టవచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. మరో మంత్రి కేఎన్ రాజన్న కూడా ఇటీవల సెప్టెంబర్ తర్వాత కర్ణాటక రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా వేశారు. ఇక్బాల్ హుస్సేన్ చేసిన ఈ ప్రకటనకు ఇది మరింత ఆజ్యం పోసింది. రామనగరలో విలేకరులతో మాట్లాడిన ఇక్బాల్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో డీకే శివకుమార్ అలుపెరగని కృషి ఉందన్నారు. పార్టీ అధిష్టానం పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుందని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
Read Also:Anant Ambani Salary: ముఖేష్ అంబానీ వారసుల్లో అనంత్ టాప్.. తన జీతం ఎంతో తెలిస్తే షాకే
డీకే శివకుమార్ కేవలం కర్ణాటకలో బలమైన రాజకీయ నాయకుడే కాదు. దేశంలోనే రెండో అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే కూడా. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక ప్రకారం.. 2023లో ఆయన మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ. 1,413 కోట్లుగా అంచనా వేశారు. ఈ గణాంకాలు విన్నవారిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఆయన సంపద గత 15 సంవత్సరాలలో అనూహ్యంగా పెరిగింది. 2008లో ఆయన మొత్తం ఆస్తి రూ. 75 కోట్లు కాగా, 2013లో అది రూ. 251 కోట్లకు, 2018లో రూ. 840 కోట్లకు పెరిగింది. 2023 నాటికి ఆయన చరాస్తులు దాదాపు రూ. 1,140 కోట్లు, స్థిరాస్తులు దాదాపు రూ. 273 కోట్లు ఉన్నాయి. అయితే, ఆయనకు మొత్తం అప్పులు రూ. 503 కోట్లకు దగ్గరగా ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. డీకే శివకుమార్ ఆదాయం కూడా నిరంతరం పెరుగుతూనే ఉంది. ఆయన ఆదాయపు పన్ను రిటర్న్ల ప్రకారం, ఆయన ఆదాయం ప్రధానంగా స్థిరాస్తులు, వ్యవసాయం, విద్య, వ్యాపారం వంటి వివిధ రంగాల నుండి వస్తుంది. ఆయన భార్య కూడా బిజినెస్ లు చూసుకుంటున్నారు. కుటుంబం ఉమ్మడి ఆస్తులలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
Read Also:Ashadam: ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే?
డీకే శివకుమార్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఆయన 1989లో మైసూర్ జిల్లాలోని సాథనూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 27 సంవత్సరాలు. ఆ తర్వాత 1994, 1999, 2004లో అదే నియోజకవర్గం నుండి వరుసగా విజయం సాధించారు. 2008 నుండి ఆయన కనకపుర నియోజకవర్గం నుండి నిరంతరం గెలుస్తూ వస్తున్నారు. తన నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా నిలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడంలో ఆయన కృషి గణనీయం. ఈ విజయం తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, 2023 ఎన్నికల తర్వాత శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య ముఖ్యమంత్రి పదవిని రొటేషనల్ ఫార్ములా ద్వారా పంచుకోవాలని ఒక ఒప్పందం కుదిరిందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం శివకుమార్కు రెండున్నర సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించవచ్చు. అయితే, ఈ ఒప్పందంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేనప్పటికీ.. ఈ చర్చలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. 2019లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనను అరెస్టు చేసింది, కానీ 2020లో కోర్టు నుండి ఆయనకు క్లీన్ చిట్ లభించి, మళ్ళీ రాజకీయంగా పుంజుకున్నారు. రాబోయే నెలల్లో కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి కీలక మార్పులు వస్తాయో వేచి చూడాలి.