Ration Card : 6 నెలలుగా రేషన్ తీసుకోని 96 వేల కార్డులు.. అనుమానాస్పద కార్డులపై సర్కార్ విచారణ!

Ration Card : తెలంగాణ రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. ప్రతినెలా కార్డులు, లబ్ధిదారుల సంఖ్య ప్రకారం డీలర్లకు రేషన్ పంపిస్తున్నప్పటికీ చాలామంది రేషన్ తీసుకోవడం లేదు. దీంతో పౌరసరఫరాల శాఖ గత ఆరు నెలల నుంచి బియ్యం తీసుకోని వారి లెక్కలను వెలికి తీసింది. ఈ పరిశీలనలో ఏకంగా 96 వేల రేషన్ కార్డులు అనుమానాస్పదంగా ఉన్నట్లు తేలింది. ఈ నెల 22 వరకు చేపట్టిన విచారణలో ఈ 96 వేల కార్డుల్లో 6 వేలకు పైగా రేషన్ కార్డులు అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డే అర్హత కావడంతో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. అదే సమయంలో, ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల్లో చాలామంది అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. మే మొదటి వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 90.71 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో మొత్తం 2.93 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరి కోసం ప్రభుత్వం ప్రతినెలా 1.90 లక్షల టన్నుల బియ్యాన్ని డీలర్లకు పంపిస్తోంది. ఉచితంగా సన్నబియ్యం పంపిణీ మొదలయ్యాక ప్రజలు రేషన్ తీసుకోవడానికి బారులు తీరుతున్నా, దాదాపు 1.6 లక్షల మంది మాత్రం ఇంకా ముందుకు రావడం లేదు.
Read Also:DRDO Recruitment 2025: డిఆర్డిఓలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. గేట్ స్కోర్తో 148 పోస్టుల భర్తీ
దీంతో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమై, రేషన్ తీసుకోని వారి జాబితాను తయారు చేసి ఆయా మండలాల్లోని తహసీల్దార్లతో క్షేత్రస్థాయి విచారణ చేయిస్తోంది. లబ్ధిదారులు ఆ చిరునామాలో ఉంటున్నారా, లేదా మరణించారా అని పరిశీలిస్తున్నారు. ఆశ్చర్యకరంగా వందేళ్లకు పైబడిన వయసులో చనిపోయినవారు కూడా రేషన్ లబ్ధిదారుల జాబితాలో పెద్దసంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరికి రెండేసి కార్డుల్లో పేర్లు ఉన్నట్లు కూడా సమాచారం. క్షేత్రస్థాయిలో తేలిన సమాచారాన్ని పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నారు.
రేషన్ కార్డుల విచారణలో సూర్యాపేట జిల్లా 100శాతం పూర్తి చేసి అగ్రస్థానంలో ఉంది. కామారెడ్డిలో 83.33%, సిరిసిల్లలో 68.06%, కరీంనగర్లో 63.49% విచారణ పూర్తయ్యింది. అయితే, 12 జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ విచారణ మొదలుకాలేదు. ఆదిలాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, గద్వాల, మహబూబాబాద్, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్ ఈ జాబితాలో ఉన్నాయి.
Read Also:Civil Services Exam :యూపీఎస్సీ సంచలన నిర్ణయం.. సివిల్స్ పరీక్షల్లో ఫేస్ రికగ్నిషన్, AI కెమెరాలు
ఇప్పటివరకు తేలిన అనర్హుల సంఖ్య జిల్లా వారీగా చూస్తే కామారెడ్డిలో 726 కార్డులు, సిద్దిపేటలో 519 కార్డులు, ఖమ్మంలో 371 కార్డులు, సిరిసిల్లలో 360 కార్డులు, కరీంనగర్లో 330 కార్డులు, యాదాద్రిలో 176 కార్డులు, మెదక్లో 106 కార్డులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విచారణ పూర్తయిన తర్వాత అనర్హుల కార్డులను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలనలో అనర్హులు భారీగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నెల 22 వరకు మొత్తం 11.13% కార్డులపై విచారణ పూర్తయ్యింది.
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్ ఈ 5జిల్లాలో అత్యధికంగా అనుమానాస్పద రేషన్ కార్డులున్నాయి. అనర్హమైనవిగా తేలిన 6 వేల కార్డుల్లో కూడా రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. ఈ విచారణ పూర్తి కాగానే, ప్రభుత్వానికి భారీగా నిధులు ఆదా అయ్యే అవకాశం ఉంది.