NEET PG : రెండు షిఫ్టుల్లో పరీక్ష వద్దంటూ పిటిషన్..సుప్రీంకోర్టులో NEET PG భవితవ్యం

NEET PG : కొంత కాలంగా వైద్య విద్యార్థులను ఉత్కంఠకు గురిచేస్తున్న NEET PG 2025 ఎగ్జామ్ నిర్వహణ పై ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారా, లేక ఒకే షిఫ్టులో నిర్వహిస్తారా అనే దానిపై సోమవారం సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించింది. జూన్ 15న ఈ పరీక్ష జరగనున్న నేపథ్యంలో జాతీయ పరీక్షా బోర్డు (NBE) రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ తీర్పు వేలాది మంది మెడికల్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది.
NEET PG పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించాలన్న NBE నిర్ణయాన్ని సవాలు చేస్తూ అదితి, ఇతర విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించడం వల్ల, ఒక షిఫ్ట్ ప్రశ్నపత్రం సులభంగా, మరొక షిఫ్ట్ ప్రశ్నపత్రం కఠినంగా ఉండే అవకాశం ఉంది. ఇది అభ్యర్థుల మధ్య అన్యాయానికి దారితీస్తుందని పిటిషనర్లు వాదించారు. అందరు అభ్యర్థులకు సమానమైన, నిష్పక్షపాతమైన పోటీని అందించడానికి NBEను ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించాలని పిటిషన్లో కోరారు.
Read Also:Viral : ముంబైలో వానల బీభత్సం.. నవ్వులు పూయిస్తున్న బాహుబలి మీమ్
ముఖ్య న్యాయమూర్తి బీ ఆర్ గవాయి, న్యాయమూర్తి అగస్టిన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు తీవ్రతను గుర్తించింది. అభ్యర్థుల తరపు న్యాయవాది త్వరలో ఎగ్జామ్ సిటీ స్లిప్లు విడుదల కానున్నాయని చెప్పడంతో, కోర్టు ఈ పిటిషన్ను ఒకటి లేదా రెండు రోజుల్లో విచారణకు జాబితా చేస్తుందని హామీ ఇచ్చింది. మే 5న కూడా సుప్రీం కోర్టు ఈ పిటిషన్కు సంబంధించి NBE, జాతీయ వైద్య కమిషన్ (NMC), మరియు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల నుంచి వివరణ కోరింది. అయితే, గత వారం కోర్టు విచారణకు హామీ ఇచ్చినప్పటికీ, పిటిషన్ జాబితా కాకపోవడంతో, పిటిషనర్లు సోమవారం మరోసారి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
NEET PG 2025 పరీక్ష జూన్ 15న జరగనుంది. ఫలితాలు జూలై 15న వెలువడే అవకాశం ఉంది. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్లో దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో నిర్వహించబడుతుంది. అప్లికేషన్ ఫారమ్లలో మార్పులు చేసుకోవడానికి ఈరోజు (మే 26, 2025)చివరి తేదీ. మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సీట్ బ్లాకింగ్ను నిరోధించడానికి సుప్రీంకోర్టు ఇటీవల కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు వెలువడిన కొద్ది రోజులకే రెండు షిఫ్టుల పరీక్షపై ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. లక్షలాది మంది వైద్య విద్యార్థులకు కీలకమైన ఈ పరీక్షపై సుప్రీం కోర్టు తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also:Viral Video : కజ్రా రే పాటకు అవ్వచేసిన డ్యాన్స్ చూస్తే ఫిదా కావాల్సిందే.. కేక పుట్టించింది