Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. నలుగురా? ఐదుగురా? కేబినెట్లోకి ఎవరెవరు?

Telangana Cabinet : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా నెలలుగా చర్చనీయాంశంగా ఉన్న మంత్రివర్గ విస్తరణ మళ్లీ తెర మీదకు వచ్చింది. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆదివారం పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో గంటకు పైగా కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణతో పాటు, పీసీసీ కార్యనిర్వాహక కమిటీ కూర్పుపైనా చర్చలు జరిగాయి. ఆశావహుల సామాజిక వర్గాలు, స్థానిక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ చర్చలు సాగాయి. అయితే, ఈ చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో సోమవారం కూడా సమావేశం కొనసాగింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేపుతోంది.
కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరబోయే నాయకుల పేర్లను దాదాపుగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, నలుగురిని తీసుకుంటారా లేదా ఐదుగురిని తీసుకుంటారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో గుర్తించిన పేర్లపై మరోసారి కూలంకషంగా చర్చించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లాకు చెందిన పి.సుదర్శన్రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బాలునాయక్, రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్రావు, గడ్డం వివేక్, కరీంనగర్కు చెందిన ఆదిశ్రీ ఖాన్ఖాన్ వంటి సీనియర్ నాయకుల పేర్లను పరిశీలించారు.
Read Also:Viral Video: ఏందయ్య ఇది మెట్రో స్టేషన్ లేకపోతే వాటర్ ఫాల్స్.. వైరల్ వీడియో
మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరును బలంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఓసీ (OC) కోటాలో రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పేర్లు ఉన్నాయి.వెలమ (Velama) సామాజిక వర్గం నుంచి కూడా ఒక పేరును పరిశీలిస్తున్నారు. ఎస్సీ (SC) కోటాలో గడ్డం వివేక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎస్టీ (ST) కోటాలో బాలునాయక్, శంకర్ నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఓబీసీ (OBC) కోటాలో వాకాటి శ్రీహరి, విజయశాంతి పేర్లు తుది పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మైనారిటీ (Minority) కోటాలో షబ్బీర్ అలీ, అమీర్ అలీఖాన్, ఫహీమ్ ఖురేషీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మైనారిటీల నుంచి ఒకరికి చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ పేర్లలో తుది ఎంపిక కోసం తీవ్ర కసరత్తు జరుగుతోంది.
కేబినెట్ కూర్పుపై స్పష్టత రాకపోవడంతో, సోమవారం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మరోసారి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. రాహుల్ గాంధీ సమక్షంలోనే కేబినెట్ అంశం, పీసీసీ వర్కింగ్ కమిటీ కూర్పుపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కూడా సీఎం భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కీలక సమావేశాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. కేబినెట్ అంశంపై అధిష్టానం నుంచి ‘గ్రీన్ సిగ్నల్’ వచ్చిన తర్వాతే సీఎం హైదరాబాద్కు బయలుదేరుతారు.
Read Also:Tirupathi: బెస్ట్ కాలేజీలో ఇంటర్ చదవాలని అనుకుంటున్నారా.. ఆలస్యమెందుకు అప్లై చేసేయండి
కేసీ వేణుగోపాల్తో జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణతో పాటు, కొన్ని కీలక రాజకీయ పరిణామాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ అంశం, మరియు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చల అనంతరం తెలంగాణ మంత్రివర్గంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.